కడప, జులై 4 : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు, సంక్షేమ ఫలాలు అందించడమే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని.., అర్హులైన ఏ ఒక్కరూ లబ్ది పొందలేదనే పరిస్థితి రాకూడదని.. “జగనన్న సురక్ష” కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు.
మంగళవారం కడప నగరంలోని 4వ డివిజన్ పరిధిలోని ఆర్.కె. నగర్ ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన “జగనన్న సురక్ష” శిబిరానికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, నగర మేయర్ సురేష్ బాబు, నగర కమీషనర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మీనా, రాష్ట్ర నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆ డివిజన్ పరిదిలోని ప్రజలు వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా “జగనన్న సురక్ష” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పాల్గొని వారందరికీ ఆయన చేతుల మీదుగా రేషన్ కార్డులు, ఆదాయ, కుల, జనన, మరణ, వివాహ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ తదితర పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల ఇంటి వద్దకే వెళ్లి, వారికి ఏం కావాలో తెలుసుకుని, ఏ ఒక్క పేదవాడు కూడా చిన్నచిన్న సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందించడమే లక్ష్యంగా సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు జగనన్న సురక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ముందుగా వాలంటీర్లు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి ఏమైనా సర్టిఫికెట్లు కావాలా, ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా తెలుసుకొని, సచివాలయాల్లో తెలిపి పరిష్కరించి జగనన్న సురక్ష శిబిరాల్లో అందిస్తారని చెప్పారు. ఏ ఒక్క కారణంతో కూడా అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదని కలెక్టర్ తెలిపారు. విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం.. విద్యార్థులకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు.. వైద్య రంగంలో కూడా పేదలకు మెరుగైన కార్పోరేట్ వైద్యం అందిస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు బలవర్థకమైన పౌష్టికాహారం అందివ్వడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా మహిళలు రక్త హీనతకు గురికాకుండా చూసుకోవాలన్నారు. 104 వాహనాల ద్వారా అన్నీ రకాలైన మందులు అందించడం జరుగుతోందన్నారు. ఎవరి ఆరోగ్య పరిరక్షణపై.. వారు జాగ్రత్త వహించాలన్నారు. అందుబారులో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జగనన్న సురక్ష ద్వారా.. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని, ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, వెంటనే పరిష్కార మార్గం చూపుతారన్నారు. పలు కుటుంబాల్లో తల్లిదండ్రులు మాత్రం సొంత గ్రామాల్లో ఉంటున్నారని, పిల్లలు ఉద్యోగాలరీత్యా ఎక్కడెక్కడో ఉంటున్నారని, కానీ వారి పిల్లల ఉద్యోగాల వలన తల్లిదండ్రులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని, అలాంటి కుటుంబాలను సైతం గుర్తించి కార్డులను విభజించి వారికి కూడా సంక్షేమ పథకాలను అందించేలా జగనన్న సురక్ష కార్యక్రమం సాగుతుందన్నారు
ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు వినోద్, 13వ డివిజన్ కార్పొరేటర్ రామలక్ష్మణ రెడ్డి, 4వ డివిజన్ ఇంచార్జి ఆర్.వి.ఆర్. రమణ, తాహసిల్దార్ శివరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.